Sunday, May 20, 2012
 

మిలట్రీవారికీ తప్పని కమసకాయ దెబ్బలు

మా ఊరు వినాయక చవితి పండుగ ఉత్సవం తీరే వేరు. సహజంగా ప్రతి ఇంట పెద్దలు, చిన్నారులు వినాయక విగ్రహానికి పూజాది కార్యక్రమాలు చేసి కానించేస్తుంటారు. అయితే మా ఊర్లో వినాయకచవితి అంటే.. సందడే సందడి. చవితి పండుగకు వారం ముందే … మా ఊరు పిల్లలందరూ సందడి చేసేవారు. కమసకాయలు ( తెల్ల ఉల్లి ఆకారంలో ఉండే ఒక రకమైన కాయలు) బస్తాలకొద్దీ పీకి ఇంటికి చేర్చేవారు.

అసలీ కమసకాయలేమిటీ.. అనుకుంటున్నారా…? తెల్ల ఉల్లి ఆకారంలో ఉండే ఈ కాయలు మా ఊరు మెట్ట పొలాలైన ఉమ్మడి బొందలు, ఏడెకరాల దిబ్బ అని పిలువబడే కొన్ని చోట్ల మాత్రమే దొరికేవి. వాటిని పీకి… జాగ్రత్తగా మా ఊరు రోడ్డు ప్రక్కన ఉన్న చెట్ల మాటునో… గుంతల్లోనే దాచి ఉంచేవారు. చవితినాడు ఈ కాయలతో రోడ్లపై వెళ్లేవారికి దేహశుద్ది చేసేవారు. ముఖ్యంగా ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు అటుగా వస్తే అంతేసంగతులు.

బాపట్ల సూర్యలంకకు మా ఊరు కూతవేటు దూరంలో ఉంటుంది. అంతకుముందు రోజు వరకూ మిలటరీ వాళ్లన్నా.. వారి వాహనాలన్నా భయపడే పిల్లలు చవితి రోజున మాత్రం సింహాలవుతారు. సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషనుకు వాహనాల్లో వెళ్లే మిలట్రీ అధికారులను సైతం మా ఊరు పిల్లలు వదిలేవారు కాదు. వారిపైనా కమసకాయల వర్షం కురిసేది.

మిలట్రీవారు ఎక్కువమంది ఉత్తరాదివారు కావడంతో… హిందీలో ఏదేదో మాట్లాడేవారు. వారి మాటలు మాకు అర్థమయ్యేవి కావు. చివరికి తమ వాహనాలను కాసేపు ఆపి… బండి దిగి… నవ్వుతూ కమసకాయల దెబ్బలను తింటూనే.. గణేశునికి దణ్ణం పెట్టి సాగేవారు. అప్పుడు తెలియలేదు కానీ, దేశమాత కోసం వారు ఎటువంటి దెబ్బలనైనా తింటారని ఇప్పుడర్థమవుతుంది. ఆ సంగతి అలా ఉంచితే…

ఇక రోడ్డుపై వెళ్లే పాదచారుల వీపులపై కమసలు నాట్యం చేసేవి. దెబ్బ ఎటునుంచి తగిలిందని వెనక్కి తిరిగి చూస్తే… ఒక్కరూ కనిపించేవారు కాదు. ఎందుకంటే.. పిల్లలందరూ తూటి చెట్ల చాటున నక్కి.. ఈ పని ప్రారంభించేవారు. పిల్ల చేష్టలకు కొందరు ఆగ్రహించినా… మరికొందరు నవ్వుకుంటూ వెళ్లిపోయేవారు.

ఈ కమసకాయలతో కొట్టడం వెనక ఓ చరిత్ర ఉన్నది. అదేమంటే… పండుగరోజున ఎవరైతే ఈ కమసలతో దెబ్బలు తింటారో… వారికి భవిష్యత్తులో ఎటువంటి కష్టాలు రావనే విశ్వాసం ఉంది. అందువల్లనే ఈ ఆచారం కొనసాగుతోందని మా నానమ్మ చెప్పగా విన్నాను. అందువల్లనో ఏమోగానీ రోడ్డుపై వెళ్లేవారు కొందరు చెట్లచాటున నక్కి ఉన్న పిల్లలను పిలిచి మరీ కొట్టించుకునేవారు. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న వినాయకుని పందిట్లో ఫలహారం సేవించి వెళ్లేవారు. అలా మా ఊర్లో మొదటి పండుగ ఉత్సవం మొదలయ్యేది.

 

అందరికీ దండం పెడతా! ఆవిష్కరణోత్సవం!

http://thumbp1-ne1.thumb.mail.yahoo.com/tn?sid=2911777484&mid=AJbHtEQAAAi7T506Qgo%2BBAxWFWk&midoffset=2_0_0_1_516313&partid=2&f=462&fid=Inbox&w=156&h=480&httperr=1

 

దిగులంతా ‘తెలుగు తక్కువ’ వాళ్ళ గురించే…!

తెలివి తక్కువ వాళ్ళ గురించిన బాధేం లేదు.
దిగులంతా ‘తెలుగు తక్కువ’ వాళ్ళ గురించే.

తక్కువయిన వాళ్ళు తక్కువయినట్లు వుంటారా? ఎక్కువ మాట్లాడతారు. అక్కడితో కూడా అగరు. తెలుగును ఉద్ధరించే సాహసానికి కూడా ఒడిగడతారు.

ఈ ఉధ్ధారకులు అన్ని రంగాల్లోనూ వుంటారు. ప్రసార మాధ్యమాల్లోనూ, విద్యాలయాల్లోనూ కాస్త ఎక్కువగా వున్నట్లు అనిపిస్తారు.అందుకు కారణం వారి గొంతులు పెద్దవని కాదు కానీ, వారి ముందు అమర్చిన మైకులు పెద్దవి. తెలుగు నాశనమయిపోతుందని బాహాటంగా బాధపడే అవకాశం, అలా వీరికి దక్కింది..

వీరి ఫిర్యాదు దాదాపు ‘వర్ణం’ దగ్గరే ఆగిపోతుంది. (కంగారు పడనవసరం లేదు. భాషలోని ‘వర్ణమే’ లెండి) అది దాటి ‘పదం’ దగ్గరకి కొందరే వస్తారు. వాక్యం దగ్గరకు మరీ తక్కువ మంది వస్తారు.

దీర్ఘాలూ, వత్తులూ, కొమ్ములూ, మేకులూ- సరిలేవటంటూ ‘వర్ణ’ క్రమం చుట్టూ తిరిగేస్తారు. ఇప్పటికీ పలుపత్రికలు తమ సిబ్బంది కోసం విడుదల చేసే ‘శైలి పత్రాల’(Style Sheets)లో వీటి గొడవే ఎక్కువ.ఆ తర్వాత పదాల గురించి యోచిస్తారు. అవి కూడా ఇంగ్లీషుపదాలకు సరిసమానమైన తెలుగు అనువాదాలు. స్థిరపడ్డ అనువాదాలనే కొత్తగా చేరిన పాత్రికేయుడు వాడుతుంటే చాలు. స్వతంత్ర తెలుగు రచనలోని పదాల సంగతి వీరికనవసరం. ఇకా వాక్యాలంటారా? ఎలా పేనుకుంటూ వెళ్ళిపోయినా, ఎవరూ మాట్లాడరు.

విద్యాలయాల్లోనూ దాదాపు ఇదే తీరు. ఇంకా గ్రాంథికమూ, వ్యావహారికమూ అంటూ, ఇంకా గిడుగు చేసిన ఉద్యమాన్నే తిరిగి తిరిగి చేస్తూ, ‘పత్రాలు’ సమర్పిస్తూ వుంటారు.
మరి వీరే తెలుగును ఉద్ధరించేస్తున్నారని ఒప్పేసుకుందామా?
‘గాడిద గుడ్డే’ం కాదూ..!

సరదాకి వచ్చిన కోపం కాదు సుమండీ. నిజంగానే వీరు ఉద్ధరించలేరని చెప్పడానికి ‘గాడిద గుడ్డు’నే ఆధారంగా తెలుగు వారి ముందు పెట్టాలనుకుంటున్నాను.

గాడిద గుడ్డు పెడుతుందా? లేదా? లేక నేరుగా పిల్లనే పెడుతుందా? ఈ గొడవ నాకనవసరం.
గాడిద గుడ్డు పెడుతుండగా కన్న వారు ఎవరూ లేరు కానీ, విన్న వారు మాత్రం వున్నారు.
తెల్లవారు మన దేశంలోని అన్ని నేలలకు వచ్చినట్లే తెలుగు గడ్డకు కూడా వచ్చారు. అలాంటి ఒకానొక తెల్లవాడు పొద్దున్నే తన బంగ్లా నుంచి గుర్రం మీద బయిల్దేరుతూ, ఒక్క సారి తన భగవంతుణ్ణి తలచుకునేవాడు. వాడు తలచుకోవటం వాడి మాతృభాషయిన ఇంగ్లీషులోనే తలచుకున్నాడు:
‘గాడ్‌ ఈజ్‌ గుడ్‌..కాంకర్‌ పీస్‌’(God is Good..Conquer Peace)
కానీ తెలుగు వాడు దీనిని తన మాతృభాషలో తాను విన్నాడు:
‘గాడిద గుడ్డు.. కంకర పీసు’
కంకర పీసు తెలుగు భాషలో లేక పోయినా సర్దుకు పోయాడు.
కానీ, ఈ దైవ ప్రార్థన అసలు అర్థం గాలికి వదిలేశాడు.
తాను అర్థం చేసుకున్నదానినే ప్రచారంలో పెట్టాడు. ఆ నోటా, ఆ నోటా వెళ్ళి అది తెలుగు వాడికి సామెతయి కూర్చుంది. ఎవరయినా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంటే ‘ఆ చెప్పావ్‌ లే గాడిద గుడ్డూ.. కంకర పీసూ’ అని కొట్టి పారేయటం మొదలు పెట్టారు అంతా.

వ్యవహారంలో తమని తాము శిష్టులుగా కీర్తించుకునే వారు కొందరు- ఈ ‘గాడిద గుడ్డు’ను కాశీకి కూడా పంపించారు. ఫలితం లేకుండా తిరిగి వచ్చిన వాడితో ‘కాశీవెళ్ళి, గాడిద గుడ్డు తెచ్చినట్టుంది’ అనటం కూడా వారు మొదలు పెట్టేశారు.

వ్యవహారమే భాష అయితే, అది ఎక్కువ సార్లు కింది నుంచే పైకి వస్తుంది.
సామాన్యుడు ఏది మాట్లాడితే అది భాషయి కూర్చుంటుంది.
ఇది ఒక్క తెలుగు భాషకే కాదు. బహుశా ఏ భాషకయినా వర్తించవచ్చు.
ఈ ముక్క ఇంగ్లీషువాడికి చెబితే, వాడు తడుము కోకుండా ‘ఓకే’ అంటాడు.
ఎందుకుంటే, ‘ఓకే’ అనే మాట కూడా ఇలా ‘వర్ణ క్రమం’ కూడా రాని అతి సామాన్యుడు సృష్టించిందే.
వెనకటికి సైన్యంలో పనిచేసే ఒక ఉద్యోగి ఇంగ్లీషులోAll Correct అని రాయటానికి బదులు Oll Korrect అని రాశాడని, అందుకే రెండు మాటల్లోని మొదటి అక్షరాలనూ కలిపి O.K అని పలకటం మొదలు పెట్టారని చెబుతుంటారు.
ఈ రెండు పొడి అక్షరాలకూ తర్వాత ఒక కొత్త వర్ణ క్రమమేర్పడింది. అది Okay అయింది. క్రియ అయింది. దానికి Okay -Okayed – Okayed అనే Conjugation కూడా ఏర్పడింది.

ఎలా చూసినా సామాన్యుడినుంచే భాష పైకి చేరుతుంది.
సామాన్యుడంటే ప్రకృతితో నిత్యమూ సంఘర్షించే వాడు.

కడలి కడుపులోకి వెళ్ళి వచ్చే పల్లెకారుడూ సామాన్యుడే. చెట్టెక్కి తేనెటీగలను చెదరగొట్టి పట్టుతేనె తీసే వాడూ సామాన్యుడే.

విత్తు పగిలి మొక్క విచ్చుకువచ్చే ప్రకృతి విశ్వరూపాన్ని దర్శించేదీ సామాన్యుడే. కాలితో తొక్కిన మట్టితో కళ్ళకద్దుకునే అన్నం కుండను చేసే కుమ్మరీ సామాన్యుడే.

ఈ సంఘర్షణలో తాను కనుగొన్న ప్రతి ఫలితానికీ, ప్రతి ప్రక్రియకూ నామకరణం చేసేది అంతిమంగా సామాన్యుడే.

ఇలా శ్రమతోనూ, ఉత్పత్తితోనూ సంబంధం లేని సోమరి వర్గాల, వర్ణాల నుంచి వచ్చిన కవుల వర్ణనల్లో సైతం ఈ సామాన్యుడికున్న పదసంపద కనిపించదు.

అందమైన అమ్మాయి కన్నులను వర్ణించటానికి ‘కమలాక్షి’ అనో ‘మీనాక్షి’ అనో అంటూ వచ్చాడు.
చేప ఆకారం వంటి కన్నుల కలది- అని అన్నందుయినా కొంచెం సంతోషిద్దాం.
కానీ, ఏ చేప ఆకారం అంటే ఏమి చెబుతాడు? కొర్రమీను అంటాడా? బొమ్మిడాయ అంటాడా; గొరక పిల్ల అంటాడా? లేక మట్టగిడస అంటాడా?

ఏవో కొన్ని సినిమా పాటల్లో తప్ప ఈ కవుల చూపు ఇంకా ‘మట్టగిడస’ మీద పడలేదు.
తెల్ల చందువ చేపల్లా మెరిసే అందమైన కన్నుల్ని ఇప్పటికీ శ్రామకి వర్గాలనుంచీ, అట్టడుగు కులాలనుంచీ వచ్చిన కవే చూడగలడు.

ప్రకృతితో సంఘర్షణే విజ్ఞాన శాస్త్రమయి, ఆ శాస్త్రం పలు శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నప్పుడు, ఇంకా భాషను ఇవేమీ తెలియకుండా పురాణగాధల్నే పుక్కిట పడుతూ వుండే పండితులే ఉద్ధరించాలనుకోవటం అత్యాశ అవుతుంది.

సామాన్యుడు మాట్లాడే భాషలో ఏయే క్రమాలను పాటిస్తున్నాడో, వాక్యాలను ఎన్ని రకాలుగో నిర్మిస్తున్నాడో గమనించి సూత్రీకరించేదే వ్యాకరణం కావాలి. ఈ సూత్రీకరణ ఇవాళ మనం మాత్రమే చేసుకుంటున్నది కాదు.

నవీన ఆంగ్ల వ్యాకరణంలో దిట్ట అయిన ప్రొఫెసర్‌ హోలడే ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ఆంగ్ల వ్యాకరణ సదస్సుకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని పరిశీలనలు చేశారు. కుహనా భాషాశాస్త్రల భ్రమల్ని పటాపంచలు చేశారు.
వ్యాకరణాన్ని వృధ్ధి చేసేది భాషాశాస్త్రవేత్తలు కారనీ, భాషా,సాహిత్యాలను బోధించే అధ్యాపకులు కారనీ ఆయన సహేతుకంగా తేల్చిపారేశారు.

భాష,సాహిత్యాల కన్నా, విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే వారే వ్యాకరణాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో కూడా రుజువు చేశారు. భౌతిక శాస్త్ర అధ్యాపకుడి రాసిన పత్రంలోని ఒక పేరాగ్రాఫ్‌ చదివి వినిపించారు. అది అద్దం లక్షణాలను వివరించే వ్యాసంలోని భాగం. అందులో Break అనే మాటను ఎన్ని భాషాభాగాలుగా ఆయన వాడుకున్నాడో వివరించారు.Break, Breakage, Breaking, Break-up ఇలా అనేక రకాలు ఉపయోగించారు.

నాడు సామాన్యులు చేసేపనే, నేడు విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చేస్తున్నారు. ప్రకృతితో సంఘర్షిస్తున్నారు. అందుకనే వీరి వల్ల భాష అభివృధ్ధి చెందుతోంది.
తెలుగులో విద్యా బోధన చేసేటప్పుడు, ఇలా శాస్త్రవేత్తలు తమ తమ భాషల్లో చేసిన మాటలకి సరయిన తెలుగు పదాలు వెతికేటప్పుడు, ఇక్కడ మన అనువాదకులు తెలుగు పదాలను వాడలేక పోతుంటారు. మళ్ళీ సంస్కృత పదాలనే(తత్సమాలు)గా ఎరువు తెచ్చుకుంటారు.

Photosynthesis అనే మాటకు ‘కిరణజన్యసంయోగక్రియ’ గా అనువాదం
చేశారు.భాష్పోత్సేకం, వక్రీభవనం- ఇలాంటి మాటలే. ఇందులో ఎక్కడా తేటతెలుగుపలుకులు లేవు. కారణమేమిటంటే, ఇంతవరకూ గ్రాంధికమైన తెలుగు చేత శాస్త్రాలను మోయించలేదు. సంస్తృతంతో పాటు ఇంగ్లీషు చదువును కూదా తెలుగులో తామే ముందు చదువుకున్న బ్రాహ్మణ వర్గాలు, ఈ విజ్ఞాన శాస్త్ర పదాలకు సరిసమానమైన వాటిని సంస్కృతంలోనే వెతికి పెట్టారు. అదే అలవాటుగా మారింది. ఆ తర్వాత పత్రికల్లోనూ, రేడియోల్లోనూ ఈ వర్గాలే పీఠం వేసుకుని కూర్చుని, అలాంటి అనువాదాలకే శ్రీకారం చుట్టాయి. ఆ వరవడే ఇప్పటికీ నడుస్తోంది.

విద్యాబోధన మొత్తం తెలుగులోనే జరగాలని గింజుకునే వీళ్ళంతా వేదాలు విన్న తమ చెవులకు ఇంపుగా(పోనీ, శ్రవణ పేయంగా) వుండే అనువాదాలనే వాడుతూ తమకి తాము గ్రాంథికం నుంచి బయిటకు వచ్చినట్లూ, వ్యవహార భాషలో మునిగి తేలుతున్నట్లూ చెబుతన్నారు.
కానీ అసలు వ్యవహారభాషకు కేవలం ‘వ్యుత్పత్తి’ సంబంధాలు కాకుండా, ‘ఉత్పత్తి’ సంబంధాలు కూడా పునాదిగా వుంటాయి అన్న విషయాన్ని వీరు ఇప్పటికీ మరుగు పరుస్తున్నారు.

తెలుగు భాషను ఇప్పుడు శుధ్ధి చెయ్యాలి. పవిత్రపరచాలి.
అందుకు అట్టడుగు వర్ణాల, వర్గాల నుంచి వచ్చిన వివిధ విజ్ఞానశాస్త్ర విభాగాలలోని అధ్యాపకులు, పరిశోధకులూ ఇందుకు నడుము కట్టాలి.
అగ్రవర్ణ సంస్కృతానువాదాలకు, దీటయిన అట్టడుగువర్ణాల, వర్గాల తేటతెలుగు అనువాదాలను, పర్యాయ పదాలను ప్రవేశపెట్టాలి.
శ్రమకు ఎవరు ఆద్యులే, వారే భాషకు సైతం ఆద్యులని నిరూపించాలి.
ఏ పనిని పనిగట్టుకు చేయక పోయినా జరిగిపోతుంది కానీ, కాస్య ఆలస్యమవుతుంది. వేగవంతం చేయటమే భాషా విప్లవం.

ఈ సందర్భంగా టాల్‌స్టాయ్‌ రాసిన ‘గాడ్‌ ఈజ్‌ వేర్‌ లవ్‌ ఈజ్‌’ అనే కథ గుర్తుకొస్తున్నది.
ఆ కథ ముగింపులో చెప్పులుకుట్టే కార్మికుడు, సోమరి వర్గాని చెందిన బోధకుడితో సంబాషణ కీలకమైనది.

‘నువ్వు Man of LETTERS కావచ్చు. కానీ, నేను Man of LEATHERS ను. నేనే నీకు బోధించాలి. నువ్వు నాకు బోధించ కూడదు’ అంటాడు.

అవును. మృత కళేబరాలనుంచి చర్మాన్ని తీయటం, శుధ్ధి చెయటం, దానిని చెప్పుగా మలచటం గొప్ప శాస్త్రం. అంటే అతడు శాస్త్రవేత్త. భాషను పరిపుష్టం చేసి భాషకు భవిష్యత్తు ఇవ్వగలిగింది- అతడు కాక మరింకెవ్వడు..?
- సతీష్‌ చందర్‌
(విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు-2011లో చేసిన సతీష్‌ చందర్‌ ప్రసంగ పాఠం)

 

భరతమాత- శకుంతల!

తల్లిదండ్రులు నిర్దయగా వ్యవహరిస్తారు. కని పారేస్తారు. మనసున్న పక్షులు మనుషులకు మించిన మానవత చూపుతాయి. పురిటిగుడ్డును కాపాడి మహర్షికి అప్పగిస్తాయి. ఆ పసిగుడ్డు బాల్యపు కడగండ్లు ఇక్కడితో ఆగిపోలేదు, కట్టుకున్న భర్త సైతం ఆడినమాట తప్పాడు. కడుపున పుట్టిన కొడుకునుబిడ్డగా, తన వారసునిగా అంగీకరించలేనంటాడు. శకుంతల జీవితమంతా అటుపోట్లే. సత్యమే గెలుస్తుందనేది ఆ తల్లి నిశ్చితాభిప్రాయం. ఆ నమ్మకంతోనే జీవిస్తుంది. చివరికి విజేతగా నిలుస్తుంది. భరతవంశానికి మూలపురుషుడైన మహారాజుకు మాతృమూర్తిగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది.
విశ్వామిత్రుని ఘోరతపస్సును అడ్డుకోవాలన్న కాంక్షతో సౌందర్యరాశి మేనకను భూమ్మీదికి పంపుతారు దేవతలు. ఆమె రూపలావణ్యాలకు విశ్వామిత్రుడు ముగ్ధుడైపోతాడు.

తపస్సు గాలికెగిరిపోతుంది. మేనకచందమామలాంటి ఆడశిశువుకు జన్మనిస్తుంది. ఆమె అప్సరస, బిడ్డను అమరావతికి తీసుకుపోలేదు. అలా అని పాపకోసం భూలోకంలో ఉండిపోనూలేదు. చివరికి కన్నపాశాన్ని తెంచుకుని స్వర్గలోకానికి వెళ్లిపోతుంది. విశ్వామిత్రుడు కూడా బిడ్డను వదిలిపెట్టి తపస్సుకు మరో వనానికి పోతాడు. అలా ఆ పసికందు అనాథ అయింది. శాకుంతలాలనే పక్షులు ఆ అమ్మాయి ఆలనా పాలనా చూస్తాయి. ఆమెను కణ్వమహర్షికి శకుంతలను అప్పగిస్తాయి. ఆ పక్షుల పేరు మీదనే ఆ బిడ్డకు శకుంతల అనే నామం స్థిరపడుతుంది. అక్కడ ఆమె మునిబాలికగా పెరుగుతుంది.

ఒకానొక రోజు కణ్వుడు లేని సమయాన దూర్వాసుడు ఆశ్రమానికి వస్తాడు. పరధ్యానంలో పడి శకుంతల ఆ మౌని రాకను గుర్తించదు. దీంతో ఆ నైష్ఠికుడు రుద్రుడవుతాడు. శాపమిస్తాడు. ‘తనను పట్టించుకోనందుకు ప్రతిగా శకుంతలను కూడా ఆమె భర్త గుర్తింపకుండు గాక’ అంటూ మంత్రజలాలను వదిలిపెడతాడు. శకుంతల విలపించడంతో శాంతించిన రుషి ‘గుర్తు చూపగలిగిన నాడు భర్త తప్పక ఆదరిస్తాడు’ అని శాపవిమోచన మార్గం చెబుతాడు.

సరిగ్గా అలాంటి సమయంలోనే క్రూరమృగాలను వేటాడేందుకు దుష్యంతుడు అడవుల్లోకి వస్తాడు. రుష్యాశ్రమంలో ఉన్న శకుంతలను చూసి, ఆమె అందానికి దాసుడవుతాడు. పెళ్లి చేసుకుంటానంటాడు. ఎదురుగా రాజ్యాన్నేలే ప్రభువు పాణిగ్రహణం కోసం త్వరపడుతున్నాడు. కలకాలం తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు.

యుక్తవయసులో ఉన్న ఏ అమ్మాయయినా ఏమంటుంది. పితృదేవునితో మాట్లాడమంటుంది. గాంధర్వ వివాహం క్షత్రియ ధర్మం అని ఉన్నపళంగా శకుంతలను తనదానిగా చేసుకుంటాడు దుష్యంతుడు. శకుంతల గర్భవతి అవుతుంది. దుష్యంతుడు ఆమెకు ‘రాజ్యానికి వెళ్లి తిరిగి వస్తానని, పట్టపురాణిగా రాచమర్యాదలతో తీసుకువెళతా’నని హామీ ఇచ్చి వెళ్లిపోతాడు. శకుంతలకు సుపుత్రోదయమవుతుంది. భరతుడు అని పేరుపెడతారు. దుష్యంతుడు ఎన్నేళ్లకీ రాడు, భరతుడు పెరిగిపెద్దవాడవుతుంటాడు.

కణ్వుడు ఓ రోజు శకుంతలతో పెళ్లయిన పిల్ల అత్తవారింట ఉండటమే శోభస్కరమంటాడు. తండ్రిని వదిలిపెట్టి దుష్యంతుని వద్దకు పయనమవుతుంది శకుంతల. ఆ మహాప్రభువు సభ తీరి ఉంటాడు. దీనవదన అయిన శకుంతలను, ముద్దులొలికే భరతుణ్ణి చూస్తాడు. కానీ గుర్తుపట్టడు. ఆమె గత వృత్తాంతాన్ని చెబుతుంది. భార్యగా ఆదరించమని వేడుకుంటుంది. పిల్లాణ్ణి దగ్గరకు తీసుకోమంటుంది. దుష్యంతుడు నవ్వి ‘ఇది కట్టుకథ’ అంటాడు. ఆమె నివ్వెరపోతుంది. ప్రమాణాలు చేసిన పెనిమిటి కఠిన హృదయుడైనందుకు చింతిస్తుంది.

దుష్యంతుడు గతాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోలేకపోతాడు సరికదా భార్యాపుత్రులను ఓరకంటితోనయినా చూడడు. ఈ పరిస్థితి ఏ స్త్రీనయినా ఎంతగా బాధిస్తుందో వేరుగా చెప్పుకోనక్కరలేదు. ఆమెకు జీవితంలో ఎదురైన పరీక్షలు చాలనుకుంటాడో ఏమో భగవంతుడు చక్కని మార్గాన్ని జ్ఞప్తికి తెస్తాడు. దుష్యంతుడు గాంధర్వ వివాహం చేసుకున్న నాటి అంగుళీయకం ఆమె వేలికి ఉంది. దాన్ని చూడగానే ఆమెకు కర్తవ్యం గుర్తుకొస్తుంది. మహారాజుకు ఆ ఉంగరాన్ని చూపుతుంది. రాజముద్రిక కళ్లపడగానే దుష్యంతుడు తుళ్లిపడతాడు. మెల్లమెల్లగా నాటి బంధాలు, అనుబంధాలు జ్ఞప్తికివస్తాయి. పొరపాటు గ్రహిస్తాడు. శకుంతల వ్యథ తొలగిపోతుంది. కథ సుఖాంతమవుతుంది.

ఈ సుఖసంతోషాలను అందుకోవడం వెనుక శకుంతల పడ్డ ఇక్కట్లు సామాన్యమైనవి కావు. ఆమెను చుట్టుముట్టిన చిక్కులు చిన్నవి కావు. సహనంతో వ్యవహరిస్తే, ధర్మబద్ధమైన జీవనం గడిపితే దైవం అనుకూలిస్తాడని చెప్పేందుకు శకుంతల గాథ ప్రత్యక్ష తార్కాణం. అందుకే పురాణాల్లో ఆమె పాత్ర ఎప్పటికీ సజీవం.

సాక్షిసౌజన్యం తో….

 

వెబ్ డెవలపర్లకు ఆహ్వానం !

వెబ్ డెవలపర్లకు  ఆహ్వానం  ,

 వెబ్ డెవలపర్స్ కొరకు ఒక సదస్సు ను  e-తెలుగు  ఈ ఆదివారము, ఏప్రిల్ 15 న   హైదరాబాద్ లో  నిర్వహించనుంది. ఈ వర్క్ షాపు పూర్తిగా ఉచితం. ఈ వర్క్ షాపులో ఈ అంశాలను చర్చిస్తాము

దయచేసి ఈ ఆహ్వాన పత్రమును మీకు తెలిసిన అంతర్జాల సాంకేతిక నిపుణులతో పంచుకొనగలరు ,  

http://etelugu.org/webdev-hyd-april15

కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థలలోనూ, ఇతరత్రా ఉపకరణాలలోనూ యూనికోడ్ ప్రమాణానికి తోడ్పాటు (ప్రత్యేకించి తెలుగు వంటి సంక్లిష్ట లిపులకు సాంకేతిక తోడ్పాటు, ఫాంట్ల అందుబాటు) పెరగటంతో ఇప్పుడు జాలంలో తెలుగు సమాచారం అనేక రూపాల్లో వెల్లివిరుస్తూంది. సమాచార సాంకేతిక ఫలాలు అన్ని వర్గాలకీ అందాలంటే ఇంకా అనేక రంగాల గురించిన సమాచారం జాలంలో అందుబాటు లోనికి రావాలి.

తెలుగులో వెబ్ సైట్లు తయారు చేసే వారికి కంప్యుటర్లు మరియు జాలంలో తెలుగు గురించిన సాంకేతిక అవగాహనను కల్పిస్తే, వారు తెలుగు సమాచారాన్ని అందించే వైవిధ్యమైన జాలగూళ్ళను వెలుగు లోనికి తీసుకువస్తారు. వారికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికే ఈ అవగాహనా సదస్సు!

సమయం

ఆదివారం, ఏప్రిల్ 15, 2012 — ఉదయం 10 గంటల నుండి
మధ్యాహ్నం 12 గంటల వరకు

వేదిక
హనీపాట్ ఐటీ కన్సల్టింగ్ ప్రై. లి.
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ – 500 004.
(గూగుల్ పటం)

సంప్రదింపులు:
93965 33666, support @ etelugu [dot] org

తెలుగులో జాలగూళ్ళను తయారుచేయడానికి అవసరమయ్యే ప్రాధమిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సులో ప్రసంగాలు, ప్రదర్శనలూ ఉంటాయి. ఈ సదస్సు దృష్టిసారించే అంశాలు:

  • కంప్యూటర్లో అక్షరాలను సూచించే ఎన్‌కోడింగ్ పద్ధతులు, యూనికోడ్ ఆవిర్భావం
  • జాలం – దాని నిర్మాణాకృతి, HTTP మరియు HTMLలలో భాషలను తెలియజేసే పద్ధతులు, మెళకువలు
  • తెలుగు టైపింగ్ పద్ధతులు
  • తెలుగు ఫాంట్లు, వాటిని వెబ్‌సైట్లలో ఉపయోగించడం (@font-face)
  • తెలుగు గురించి వివిధ ప్రోగ్రామింగ్ భాషలలో (PHP, ASP.net, Java) అమరికలు
  • మొబైళ్ళలో తెలుగు
  • డ్రూపల్, వర్డ్‌ప్రెస్ వంటి ప్రముఖ CMS (విషయ నిర్వహణ వ్యవస్థ) లలో తెలుగు సంబంధిత అమరికలు

ఈ సదస్సు ఇప్పటికే వెబ్ డెవలప్‌మెంట్ చేస్తున్న/నేర్చుకుంటున్న వారికి ఉద్దేశించినదే అయినా సాంకేతికంగా జాలం అందులో తెలుగు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు కూడా ఈ సదస్సు నుండి లబ్ది పొందవచ్చు.

ఈ సదస్సుకి హాజరై తద్వారా నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని తెలుగు గూళ్ళను తయారుచేస్తారని ఆశిస్తూ…

e-తెలుగు బృందం.

 

తెలుగుకు మత పవిత్రస్థాయి తెచ్చుకోవాలి!

మన దేవుళ్ళకు తెలుగు రాదా?

దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయించే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. దీనికి బదులు మనం ఇదే విషయాన్ని తెలుగులో మనమే చెప్పకూడదా. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయో ర్మధ్యదేశే అస్మద్‌ గృహే పత్నీ సహితం అని వగైరా మన ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తాడు.ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలిగిన వ్యక్తిని భరతవర్షంలో భరత ఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణాగోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్ని కోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న.

ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసును బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.మన దేవుళ్ళు ఏ భాషలో మాట్లాడారో మనకు తెలి యదు. తెలుసు అని అనుకుని చెప్పేవాళ్ళు మా త్రం దేవుళ్ళు సంస్కృతంలో మాట్లాడుకుంటారు అని చెబుతారు. అందుకే దీన్ని దేవభాష అనీ అంటుంటారు అంతే కాదు దీన్ని గీర్వాణభాష అని గీర్వాణంగా చెబుతారు. కాని దేవుళ్ళు మాట్లాడగా విని చెప్పిన వారు తటస్థిస్తే దీన్ని నిక్క చ్చిగా నమ్మే వీలుంది. దేవుళ్ళలో కూడా జండర్‌ వివక్ష చాలా ఉందని చెప్పడానికి వీలుంది. మన సంస్కృత నాటకాల్లో పురుష దేవతలు అందరూ సంస్కృతంలో సంభాషిస్తూండగా సేవకులు పరిచార కులు వంటి అథమ పాత్రలు, స్ర్తీ దేవతలు మాత్రం సమాజంలో తక్కువగా భావించిన ప్రాకృత భాషలో మాట్లాడతాయి.

ఇదంతా మన సంస్కృత నాటకకారుల చేతిచలువే కాని దేవతా స్ర్తీలు ఏ భాషలో మాట్లాడారో వారికేం తెలుసు అని మన ఫెమినిస్టు వీరనా రీమణులు అడిగే అవకాశమూ లేకపోలేదు. నిజానికి దేవుళ్ళు ఏభాషలో మాట్లాడినా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని మనం మాట్లాడే తెలుగు వారికి అర్థం కాదట. దీనితోనే మన కు ఇబ్బంది వచ్చింది.
ప్రతి మనిషి తాను పుట్టిన ఇంట్లో తల్లి తండ్రి కుటుంబ సభ్యులతో నేర్చుకునే భాష ఒకటి ఉంటుంది. దాన్నే మాతృభాష అని అంటారు. నిజానికి ఇది కుటుంబ భాష. వ్యక్తి పెరిగి విద్యావంతుడు అవుతూ ఇతర భాషలు నేర్చు కుంటాడు. తన సామాజిక అవస రాలకు ఏ భాష అవసర మో దానిలో అతను పని చేసుకుంటాడు. తన దైనందిన జీ వితపు అవస రాలకు తన భాషే విని యోగప డాలని ప్రతి భాషీ యుడు కోరుకుం టాడు. అలా వీలుపడని సందర్భాలలో ఆ సందర్భా నికి అవసరమైన భాష లో పని చేసుకోవలసి ఉంటుంది.

ప్రతి భాషకు సంబంధించిన వారికి, ప్రతి సంస్కృతిలోని వారికీ సామా జిక సందర్భాలతో పాటు మత సందర్భాలూ ఉంటాయి. అంటే దేవునితో సంబంధం ఉన్న సందర్భాలు అని కూడా వీటిని చెప్పవచ్చు. ప్రతి సంస్కృ తిలో జానపదులలో గిరిజన తెగలలోను ఈ మత సందర్భాలలో దేవునికి మనిషికి మధ్యన మరొక మనిషి ఉంటాడు. ఇతడినే పూజారి అని ఆచార మంతుడు అని, ముజావర్‌ అని పాస్టర్‌ అని ఒక్కొక్క మతంలో ఒక్కో సం స్కృతిలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ మధ్యవర్తి మన తరఫున దేవునితో మాట్లాడుతుంటాడు.

ప్రతి సంస్కృతిలోను దేవునితో మాట్లాడే భాష దేవుడు మాట్లాడే భాష వేరుగా ఉంటాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే చాలా మత గ్రంథాలు సామాన్య మానవు లు మాట్లాడే భాషలో లేవు. అంతే కాదు మత సంబంధమైన దైవ సంబం ధమైన కార్యక్రమాలు అన్నీ అందరికీ అర్థంకాని భాషలో ఉంటాయి. ఒక తరహా భాషకు మతగౌరవం లభించిన తర్వాత ఆ భాష అర్థంకాకపోయినా ఫర్వాలేదు అనే భావన ఆ భాషీయులలో కలగడం అన్ని చోట్లా గమనించవచ్చు. అందుకే వీటిని రిచ్యువల్‌ లాంగ్వేజస్‌ అని అంటారు. అంటే ఇక్కడ పావిత్య్రం అనే భావన భాషతో ఉందే కాని భావంతో ప్రధానంగా కాదని. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుగు నేలపై లేదా ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో ఏం జరుగుతుందో గమనించి మంచి చెడు ఆలోచన చేద్దాం. ఆంధ్ర దేశంలో ఎక్కువ శాతం ప్రజలలో అంటే చాలా కులాల వారికి మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేది బ్రాహ్మణ కులానికి చెందిన పూజారులు.

లైఫ్‌ సైకిల్‌ రిచ్యువల్స్‌ వీటినే జీవన చక్ర సంబరాలు అని అంటారు. అంటే మనిషి పుట్టి నప్పుడు చేసే ఆచారం దగ్గరనుండి ఉపనయనం, రజస్వల, పెండ్లి, గర్భాదానం తిరిగి పుట్టుక అంటే బారసాల మరణం వీటన్నింటి సందర్భాలలో పూజారి ఉండి మనతో ఆయన పూజ చేయించ వలసి ఉంటుంది. మన తరఫున దేవునికి ఆయన మంత్రాలు చదువుతాడు. అంతే కాదు చాలా ఇతర సందర్భాలలో అంటే గృహప్రవేశం, సత్యనా రాయణస్వామి వ్రతాలు వంటి చాలా వ్రతాలలోను ఇలాంటి ఇతర మత సందర్భాల లోను పూజారి లేకుండా పనులు జరగవు. ఇక గుడికి పోతే మనం చేసే అష్టోత్తరం సహస్రనామం, అర్చనలు వంటి అన్ని సేవలు మన తరఫున పూజారి చేస్తాడు. తెలు గు నేలమీద తెలుగు వారి ఇండ్లలో, గుడులలోను జరిగే ఈ అన్ని కార్య క్రమాలలో ను పూజారి చదివే మంత్రాలు పూజలు అన్నీ అటు పూజారికీ ఇటు చేయించుకునే వారికి తెలిసిన తెలుగు భాషలో జరగవు. ఇవి అన్నీ సంస్కృత భాషలో జరుగుతాయి.

దేవునికి ఘంటానాదం సమర్పయామి, మధ్యమధ్యే పానీయం సమర్పయామి, దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, నాట్యం దర్శయామి అని మనం చేసే సేవలు అన్నింటికీ మన తరఫున పూజారి మనకు తెలియని సంస్కృతభాషలో చదువు తాడు. దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయించే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. దీనికి బదులు మనం ఇదే విషయాన్ని తెలుగులో మనమే చెప్పకూడదా. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయోర్మధ్యదేశే అస్మద్‌ గృహే పత్నీ సహితం అని వగైరా మన ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తా డు. ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలి గిన వ్యక్తిని భరతవర్షంలో భరతఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణా గోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్నికోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న. ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసు ను బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.

అంతే కాదు పెళ్ళి సందర్భంలో వరుడుతో తాళి కట్టే ముందు పూజారి ఒక మంత్రం అనిపిస్తాడు. మాంగల్యంతంతునానేనా మమ జీవన హేతునాం కంఠే బధ్నా మి శుభగే సంజీవ శరదాం శతం అని. నోరు తిరిగినా తిరగకపోయినా పెళ్ళికొడుకు దాన్ని చెప్పి తర్వాత ఆమె మెడలో మాంగల్యాన్ని కడతాడు. ఇది పూజారికి అర్థం అయితే కావచ్చుగాక కాని తాళికట్టే పెండ్లి కొడుకులకు దీని అర్థం నూటికి తొంభై తొమ్మిదిమందికి అర్థంకాదు. కట్టించుకునే పెండ్లి కూతు రుకీ అర్థంకాదు, చుట్టూ ఉన్న బంధుమిత్రులకూ అర్థంకాదు. ఇంత బాధ ఎందుకు పెండ్లి కొడుకుతో నేను నూరేండ్లు హాయిగా ఈమెతో కలిసి జీవించడానికి గాను ఈమె కంఠంలో మాంగల్యా న్ని కడుతున్నాను అని చక్కగా తెలుగు లో చెప్పి కట్టవచ్చుగా. మిగతా ప్రమాణాలు అన్నీ కూడా ఇలా తెలు గులో చేస్తే చాలా హాయిగా ఉండదా.

కాని పెండ్లివేళ అక్కడికి ఆవాహన చేసిన దేవుళ్ళకి ఈ తెలుగు అర్థంకాదట. దేవుళ్ళకి అలా సంస్కృతం మం త్రాలలోనే చదివితేనే పవిత్రమైనదని వారికి తెలుస్తుందని ఒక పూజారిగారు సెలవి చ్చారు. అంతే కాదు అలా మంత్రాలని తెలుగులో చదివి చెప్పడాన్ని పెళ్ళి చేయించు కునే ప్రజలు ఎవరూ అంగీకరించేలా కూడా లేరు. వారికి కూడా సంస్కృతం మంత్రా లు చదివితేనే తృప్తి అక్కడికి అది పవిత్రమౌతుందని భావం కలుగుతుంది. గుడిలో జరిగే విషయంలోను ఇదే జరుగు తుంది. కాని ఒకప్పుడు కవి రాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పెండ్లిండ్లు అన్నీ తెలుగులో చేయవచ్చని, చేయాలని ఒక ఉద్యమంగా గ్రహించి చేపట్టారని చాలా సందర్భాలలో అలా చేయించారని పెద్ద వాళ్లు చెప్పగా విన్నాను. పెండ్లి మంత్రాలన్నీ తానే చదివి దేవునికి అప్పగిస్తే పెండ్లి కొడు కు ఊరక అతను చెప్పినవన్నీ చేస్తే ఆమె ఎవరి భార్య అవుతుం ది అనే తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తాడు వెనిగళ్ళ సుబ్బా రావు పెండ్లి మంత్రాల వెనుక బండారం అనే పుస్తకంలో.
కాని పరిస్థితి దేశం అంతటా ఇలా లేదు.

చాలా గ్రామ దేవతల గుడులలో, పేరం టాళ్ళ దేవతల గుడులలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు, దళితులు పూజారులు గా ఉన్నారు. అక్కడ జరిగే ఆచారాలన్నింటి లో తెలుగులోనే పూజా కార్య క్రమాలు జర గడం గమనించవచ్చు. చాలా గ్రామ దేవ తల గుడులలో రజకులు, క్షురక వృత్తి వా రు పూజారులుగా ఉన్నారు. అలాగే కొమ్ములవాళ్ళు, బైండ్లవాళ్ళు వంటి దళితులు పూ జలు చేసే గుడులు, జాతరలు కొన్ని ఉన్నా యి. వాటిలో ఈ కులాల పూజారులు వారి మంత్రాలను ఆచారాలను తెలుగులోనే చేస్తారు. కొన్ని సందర్భాలలో వినపడకుం డా చదవడం కూడా ఉంది. దీన్నిబట్టి పవిత్ర కార్యక్రమాలు తెలుగులో చేసుకోవచ్చు అని ఒక నిరూపణ మనకు ఉండనే ఉంది.

చాలా మంది గిరిజనులు వారి దేవతల పూజల్ని వారి భాషలోనే చేసుకోవడం ఉం ది. ఇన్ని ఉండగా నూటికి ఎనభై మంది పై గా ఉన్న తెలుగు వారు అటు గుడు లలోను ఇటు ఇండ్లలో జరిగే మత కార్యక్రమాలలో ను ఎరికీ తెలియని సంస్కృత భాషను ఎం దుకు వాడాలి మనకు తెలిసిన తెలుగులోనే మనం చేసుకోకూడదా. నిజానికి మనం మ న దేవునికోసం మనమే చేసే పూజకు మధ్య వర్తి ఉండి మనకు తెలియని భాషలో చదవ డం అవసరమా. ఇవి మౌలికమైన ప్రశ్నలు. ఇవి విశ్వాసానికి మాత్రమే సంబంధించిన వి కావు. అసలు దేవుని దృష్టిలో మనుషుల మధ్య తారతమ్యాలు లేనట్లే భాషల మధ్య కూడా ఉండవు. అది నిజంగా దేవుడే అయితే అసలు ఉండడానికి వీలులేదు. మన దేవుళ్లకు తెలుగు రాదా అని ప్రశ్న వేసు కుంటే రాదు అని చెప్పగలిగే తెలుగువారు ఉన్నారా. రాదు అని చెప్పలేనప్పుడు మన తెలుగుకు మతసంస్కార స్థాయిని కల్పించి గుడిలో ఇంట్లో అన్ని మతకార్యా లకు తెలుగే ఎందుకు వాడకూడదు అని ప్రశ్న వేసు కుందాం.

ఈ విషయంలో క్రిస్టియన్లు కొంత మెరుగు అనిపిస్తుంది వారు మత ప్రచారం చేయడానికి తమ లక్ష్యంగా ఎవరు ఉన్నారో వారి భాషలోనే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. క్రీస్తు భాష అని హీబ్రూ భాషలో చేయరు. కాని వారి తెలుగు విషయంలోను తకరారు ఉంది. వారు ఒక ప్రత్యేకమైన తెలుగును కృతకమైన దాన్ని అభివృద్ధిపరిచారు. వారి మతప్రచారకు లకు మామూలుగా అందరికీ అర్థమయ్యే తెలుగు వచ్చినా దానిలో మాట్లాడరు. వారి కృతక తెలుగులోనే మాట్లాడతారు. ఆ తెలుగుకు మత స్థాయి వచ్చింది.
బడుల్లో తెలుగు పరిస్థితి దీనాతిదీనంగా ఉందనే విషయం మొన్న విశాఖ పట్నం లో జరిగిన సంఘటన. అధికారభాష అమలుకూడా ప్రభుత్వం చేతిలో ఉంది. దాని కోసం ఉద్యమం చేయాల్సిందే. కాని మన ఇండ్లలో చేసే పూజల్లోను గుడుల్లో చేసే పూజల్లోను మనకు మనమే దేవునికి మనకు తెలిసిన మన తెలుగులో చేసుకోలేమా అని ప్రశ్నించుకొని ఆచరిస్తే మన తెలుగుకు మతసంస్కార స్థాయిని, పవిత్ర స్థాయిని తెచ్చుకోవడం మన చేతల్లోనే ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేసైనా తెలుగుకు మతపవిత్రస్థాయికూడా తెచ్చుకోవాలి. నాకు తెలుగు అర్థం కాదు అనే దేవుడు ఉంటాడని దేవుడిని నమ్మేవాళ్ళు ఎవరైనా అంటారా. చూద్దాం వేచి చూద్దాం.

–సూర్య దిన పత్రిక సౌజన్యంతో…

 

మాకు తెలుగు రాద౦డీ! అనట౦ మాతృభాషా ద్రోహమా! మాతృ ద్రోహమా!

బిడ్డపుట్టగానే మొదటి ఏడుపు ఆ బిడ్డ మాతృభాషలో ఉ౦టు౦దని శాస్త్రవేత్తలు నిరూపి౦చారు. తల్లి కడుపులో ఉన్న౦త కాల౦ తల్లి మాట్లాడుతు౦డగా వి౦టూ వచ్చిన భాషను ఆ బిడ్డ అనుకరి౦చే౦దుకు చేసే ప్రయత్నమే ఈ తొలి ఏడుపు.  భూమ్మీద పడుతూనే బిడ్డ చేసే తొలి రోదన౦ మాతృభాషలోనే ఉ౦టు౦దని, బిడ్డ మనసు మాతృభాషలోనే రూపొ౦దుతు౦దని ఋజువయ్యి౦ది. ఏడుపుకు భాషలేదనే మన నమ్మక౦  వమ్ము అయ్యి౦ది.

            ఫ్రె౦చి తల్లికి పుట్టిన బిడ్డ ఫ్రె౦ఛి భాషలోనూ, జెర్మనీ తల్లికి పుట్టిన బిడ్డ జెర్మన్ భాషలోనే ఏడుస్తారనేది ఈ తాజా పరిశోధనా సారా౦శ౦. దీన్నిబట్టి, మాతృభాషలోనే మనో భావాలను వెల్లడి౦చే ప్రయత్న౦(ability to actively produce language) అనేది పుట్టిన క్షణ౦ను౦చే బిడ్డ మొదలు పెడతాడని అర్థ౦ అవుతో౦ది. తల్లిభాషలో ఉ౦డే యాసను, ధ్వని విధానాన్నీ(rhythm and intonation) గర్భ౦లోనే బిడ్డలు పసిగడతారనీ, పుడుతూనే వాటిని అనుకరిస్తూ తమ ధ్వనులలో మనోభావాలు వ్యక్త పరుస్తారనీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ “యాస” అనే మాటని “భాషలోని లయ(rhythm)” అనే అర్థ౦లో వాడట౦ జరిగి౦ది. తమిళ౦,ఆ౦గ్ల౦, తెలుగు, స౦స్కృత౦ మొదలైన భాషలలో లయపర౦గా ఉన్నతేడాలు మనకు తెలుసు. అలాగే, జెర్మనీ, ఫ్రె౦చి భాషల లయలలో తేడాలు ఎలా ఉ౦టాయో శాస్త్రవేత్తలు విశ్లేషి౦చారు. సాధారణ౦గా జెర్మన్ పదాలు పై స్థాయి ను౦చి కి౦దిస్థాయికి వస్తాయని, ఫ్రె౦చి పదాలు క్రి౦దిస్థాయి ను౦చి పై స్థాయికి వెడతాయనీ గుర్తి౦చారు. ఫ్రె౦చి భాషలో త౦డ్రిని “papaa” అని ఆరోహణ౦లో పలికితే, జెర్మన్ భాషలో “paapa” అని అవరోహణ౦లో పలుకుతారట.  జెర్మన్, ఫ్రె౦చి బిడ్డలు మొదటి ఐదు రోజులలో చేసిన రోదనల ధ్వని తర౦గాలు sound tracks ని ప్రయోగాత్మక౦గా విశ్లేషణ చేశారు. పాప ఏడ్చినప్పుడు మధ్యలో గాలి పీల్చుకోవటానికి ఇచ్చే కొన్ని క్షణాల విరామానికి ము౦దు ఏడుపు హెచ్చు స్థాయిలో ఉన్నదా లేక తక్కువస్థాయిలో ఉన్నదా అని పరిశీలి౦చారు. ఆకలి వలన, అసౌకర్య౦ వలన, వ౦టరితన౦ వలన పసికూనలు చేసే రోదనలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని విశ్లేషి౦చారు. జెర్మన్ బిడ్డల రోదన౦ హెచ్చుస్థాయి ను౦చి తగ్గుస్థాయికి అవరోహణ క్రమ౦లో ఉ౦డగా, ఫ్రె౦చి బిడ్డల రోదన౦ దిగువస్థాయి ను౦చి పై స్థాయికి ఆరోహణ క్రమ౦లో ఉన్నట్టు తేలి౦ది.“వా…వ్హ్” అని ఏడ్చే బిడ్డకీ “హ్వో…యీ…” అని ఏడ్చే బిడ్డకీ మాతృభాషలు వేర్వేరుగా ఉ౦డటాన్ని ఈ విధ౦గా గమని౦చారు. పుడుతూనే “mam…mam” అని ఇ౦గ్లీషు బిడ్డ ఏడిస్తే, “అమ్…మ” అని తెలుగు బిడ్డ ఏడవటాన్ని మన౦ కూడా గమని౦చవచ్చు. ఏడుపుకు భాష ఉ౦ది. అది మాతృభాషలో ఉ౦టు౦ది.           జెర్మనీలోని ఉర్జ్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చె౦దిన శ్రీమతి Kathleen Wermke అనే మానవీయ శాస్త్రవేత్త ఈ పరిశోధనలకు నాయకత్వ౦ వహి౦చారు. తల్లి గర్భ౦లో ఉ౦డగా తాను నేర్చుకున్న భాషలోనే కొత్త పాపాయి మాట్లాడుతు౦దనేది ఈ పరిశోధనల సారా౦శ౦. ఎలా మాట్లాడుతు౦ది? తన ధ్వనులతో మాట్లాడుతు౦ది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ మన౦ మన ధ్వనులను నేర్పి౦చట౦ ప్రార౦భిస్తా౦. భాషలొ మెళకువలన్నీ తెలియ పరుస్తా౦. కానీ, మన౦ నేర్పి౦చట౦ మొదలు పెట్టకు౦డానే, ఇ౦కా పుట్టకు౦డానే, అమ్మ కడుపులోనే ఈ నేర్చుకోవటాలన్నీ స్వయ౦గా మొదలు పెడుతుతున్నాడు బిడ్డ.  దీన్ని మనో విశ్లేషణ శాస్త్ర పరిభాషలో  “pre-adaptation for learning language” అ౦టారు. మాతృభాష ప్రభావ౦తో బిడ్డ మనసు రూపొ౦ది, మాతృభాషలోనే అది పరిణతి పొ౦దుతు౦ది. మాతృభాషకు అతీత౦గా బిడ్డను పె౦చాలని చూస్తే అది మానసిక దౌర్బల్యాన్ని కలిగిస్తు౦దని శాస్త్రవేత్తలు నిర్ధారి౦చారు. అమ్మ కడుపులో నేర్చిన భాషలోనే బడిలోకి వచ్చాక నేర్చుకొ౦టున్న భాషని అనువది౦చి అర్థ౦ చేసుకొనే ప్రయత్న౦ చేస్తారు. ప్రాథమిక పాఠశాలలలో అమ్మభాషని నిషేధిస్తే, భాషాపరమైన అవ్యవస్థ (language disorder) ఏర్పడుతు౦దని ఈ పరిశోధనకు నాయకత్వ౦ వహి౦చిన కథ్లీన్ వెర్క్ శాస్త్రవేత్త చాలా స్పష్ట౦గా పేర్కొన్నాడు.
            “నిఃశ్వాసోఛ్చ్వాస స౦క్షోభస్వప్నాశాన్ గర్భో~ధిగఛ్చతి/మాతుర్నిశ్వసితోచ్వాస స౦క్షోభ స్వప్న స౦భవాన్” అనే సుశ్రుతుని ఆయుర్వేద సిద్ధా౦తాన్ని ఇక్కడ పరిశీలి౦చాలి.  తల్లి గర్భ౦లో పెరుగుతున్న శిశువు పైన తల్లి ఉచ్చ్వాస, నిఃశ్వాసాలు, తల్లి మనోభావాలు ప్రభావ౦ చూపుతాయి. అలాగే,  బిడ్డ మనో భావాలు కూడా తల్లి పైన ప్రసరి౦చట౦ వలనే గర్భవతులకు వేవిళ్ళు కలుగుతాయని ఈ సిద్ధా౦త౦ చెప్తో౦ది. నాలుగవ నెల వచ్చేసరికే గర్భస్థ శిశువులో హృదయమూ, మనో వృత్తులు ఏర్పడట౦ మొదలౌతాయి.  కాబట్టి, నాలుగవనెల గర్భవతిని “దౌహృదిని” అ౦టారు. తనదొకటీ-తన కడుపులో బిడ్డదొకటీ రె౦డు హృదయాలు కలిగినది దౌహృదిని! హృదయమూ, మనో వృత్తులూ, సుఖదుఃఖ భావనలన్నీ బిడ్డకు కలగట౦లో మాతృభాష నిర్వహిస్తున్నపాత్ర ఎ౦తయినా ఉ౦దని దీన్ని బట్టి అర్థ౦ అవుతో౦ది.
మన శబ్దాలు, మావిపొరలమధ్య ఉమ్మనీటిలో పెరుగుతున్నశిశువులకు యథాతధ౦గా వినిపి౦చవు. నీటిలో చేపలు వాటి శరీరా౦గాలను౦చి, ఎముకలను౦చీ మెదడుకు చేరిన ధ్వని తర౦గాలను గ్రహి౦చినట్టు, బిడ్డ ఉమ్మనీటిలో౦చి తల్లి భాషను స్వీకరి౦చట౦ ప్రార౦భిస్తాడని లీప్ జీగ్ కు చె౦దిన Max Planck Institute for Human Cognitive and Brain Sciences ప్రొఫెసర్ Angela D. Friederici  వెల్లడి౦చారు. అ౦దుకే, వివిధ భాషలు వినిపి౦చే గ౦దరగోళ వాతావరణ౦లో నెలలు ని౦డిన తల్లులు తిరగకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అర్జునుడు పద్మవ్యూహ౦ గురి౦చి కడుపులో బిడ్డకు చెప్పిన కథలో అసాధ్య౦ లేదన్నది వాస్తవ౦.  నెలలు ని౦డుతున్న తల్లులు మన టీవీ యా౦కర్ల స౦కరభాష అదేపనిగా వి౦టే, దాని చెడు ప్రభావ౦ పుట్టబోయే బిడ్డ మానసిక స్థితిపైన తప్పకు౦డా పడుతు౦దన్నమాట! గర్భస్థ శిశువులు గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ మెదడు ధ్వని తర౦గాలను స్వీకరి౦చ గలుగుతు౦దని కూడా ఈ ప్రొఫెసర్ గారి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
          మాతృభాషల మీద కార్పోరేట్ విద్యార౦గ౦ తీవ్రమైన అఘాయిత్యాలు జరుపుతున్న రోజుల్లో, 2009 నవ౦బర్ 5న కరె౦ట్ బయాలజీ అనే వైద్యపత్రికలో ఈ “సైకో లి౦గ్విస్టిక్స్” అ౦శ౦మీద తొలి పరిశోధన 
వెలువడి౦ది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశ౦లో 2009 మే, 16న “ప్రప౦చ౦లోని అన్ని దేశాల, ప్రా౦తాల, ప్రజలు మాట్లాడుకొనే భాషలను స౦రక్షి౦చే కార్యక్రమాలు చేపట్టా”లని (A/RES/61/266) తీర్మాన౦ చేసిన నేపధ్య౦లో ఈ పరిశోధనా౦శాలు ప్రాముఖ్యతను స౦తరి౦చుకున్నాయి.   
భాషాస౦స్కృతులకు జాతులు పునర౦కిత౦ కావాలని యునెస్కో స౦స్థ 2010 అ౦తర్జాతీయ మాతృభాషా దినోత్సవ౦ స౦దర్భ౦గా పిలుపునిచ్చి౦ది. అ౦దుకు అనుగుణ౦గా మన విద్యావ్యవస్థ గానీ, మన ప్రభుత్వ య౦త్రాగ౦ గానీ గట్టిగా స్ప౦ది౦చిన స౦దర్భాలు లేవనే చెప్పాలి. ప్రాధమిక విద్య వరకూనైనా తెలుగు చదివిస్తే తెలుగు పిల్లలకు గ్రహణ శక్తి బాగా పెరుగుతు౦ది. కానీ, ఎల్ కేజీ పిల్లలు కూడా  తెలుగే మాట్లాడ కూడదనే వెర్రి నిబ౦ధనని  కార్పోరేట్ విద్యా స౦స్థలు సృష్టిస్తే, “పులిని చూసి వాత” అన్నట్టు మధ్య తరగతి విద్యాలయాలూ ఈ వెర్రిని సొమ్ము చేసుకొవాలని ప్రయత్ని౦చాయి. గత రె౦డు దశాబ్దాలుగా ఈ ధోరణి కొనసాగుతూ వస్తో౦ది. అ౦దువలన “తెలుగు రావట౦” అనే తప్పు తమ విషయ౦లొ జరిగి పోయి౦దనే ఒక అపరాథ భావన పిల్లల్లో కలిగి,  అది మనోదౌర్బల్యానికి దారితీస్తో౦ది. తెలుగు రాని తెలుగుబిడ్డ తెలుగు వచ్చినవాడితో పోలిస్తే, మానసిక౦గా బలహీనుడే అవుతాడు.
 “మాకు తెలుగు రాద౦డీ” అని  ఒక చెప్పుకోవట౦ విద్యార౦గ౦ సృష్టి౦చిన వెర్రి ప్రభావమే!  పిల్లల కోస౦ తల్లిద౦డ్రులు కూడా విదేశీ భార్యా భార్తల్లా ఇ౦ట్లో ఇ౦గ్లీషులో మాట్లాడుకోవాలసిన దుస్థితిని కావాలని విద్యా వ్యవస్థ తెచ్చిపెట్టి౦ది. ఏవో కొన్ని పడిగట్టు పదాలే తప్ప, మనసు విప్పి మాట్లాడు కునే౦దుకు మనకు పరాయి భాషలో నేర్చిన మాటలు చాలవు. మాతృభాషను దెబ్బతీస్తే ఏ దేశ౦లో నయినా ఇలానే జరుగు తు౦ది. మనో దౌర్బల్య౦ పెరిగి, బలహీనమైన తరాలు తయారవుతారు. మాతృభాషలోనే పెరగట౦ అనేది పిల్లల హక్కుగా చట్ట౦ తీసుకు రావలసిన సమయ౦ ఇది.  జాతి సిగ్గు పడాల్సిన మైదుకూరు, విశాఖ, విజయవాడ లా౦టి స౦ఘటనలు మళ్ళీ మళ్ళీ మన రాష్ట్ర౦లో జరగకు౦డా ఉ౦డాల౦టే, ప్రాధమిక విద్యలో మాతృభాషని తప్పని సరి చేయట౦ ఒక్కటే పరిష్కార మార్గ౦. మన పిల్లలకు రేపు ఇ౦గ్లీషు బాగా రావట౦ కోసమే ఇవ్వాళ తెలుగు నేర్పి౦చాలని మన౦ గుర్తి౦చాలి. ఆ౦గ్లాన్ని కాదు, ఆ౦గ్ల౦ మాత్రమే ఉ౦డాలనే ఇ౦గ్లీషు మానస పుత్రుల మాతృ ద్రోహాన్నే ఇక్కడ ప్రశ్నిస్తున్నది! అవును! ఆ౦గ్ల౦ మాత్రమే ఉ౦డాలనే విధానాన్ని మాతృభాషా ద్రోహమూ, మాతృ ద్రోహమూ గా పరిగణి౦చి తీరాలి!
-Dr.GV Purna Chandu.
Susruta Ayurvedic Hospital,
1st Floor, Satnam Towers,
opp.Buckinghampeta Post Office,
Governorpeta,
Vijayawada - 520002.
purnachandgv@gmail.com
 

పదకవితా పితామహుడు “అన్నమయ్య”

అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.

కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ప్రధాన మందిరంలో ఘంట అవతారమని కూడా అంటారు). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.

చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.

జీవితగాథ

అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది. అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం. కాని బహువిధాలైన నమ్మకాలూ, అనుభవాలూ, ఘటనలూ, కథలూ ఈ వివరాలలో పెనవేసుకొని ఉన్నాయి.

వంశం

10వ శతాబ్దంలో వారాణసిలో తీవ్రమైన కరవు వచ్చినపుడు కొందరు పండితులు దక్షిణాదికి వలస వచ్చారని, వారిలో "నందవరం" గ్రామంలో స్థిరపడినవారు నందవరీకులయ్యారని అంటారు. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పిందట.

బాల్యం

నారాయణయ్య కొడుకు నారాయణ సూరి. విద్యావంతుడు. అతని భార్య లక్కమాంబ. ఆమెది తాళ్ళపాక సమీప గ్రామం మాడుపూరు. అక్కడ ఉన్న విష్ణువు కోవెలలో అమె శ్రద్ధగా మాధవుని అర్చించేదట. వారికి చాలా కాలం సంతానం కలుగలేదు. అతడు, అతని భార్య సంతానార్ధులై తిరుమలను దర్శించారట. ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట.[1] అలా పుట్టిన శిశువే అన్నమయ్య. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు (మే 9, 1408) కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు. 8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది.

అన్నమయ్య ఇంటిలో తల్లి సంగీతం, తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు. ఉపవీత సంస్కారం పొందిన తరువాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది. ఏక సంధాగ్రాహి అయినందున అనతికాలంలో ఉన్నత విద్యావంతుడయ్యాడు. తన పదహారవ యేట అన్నమయ్యకు శ్రీవేంకటేశ్వర దర్శనానుభూతి కలిగింది. అప్పటినుండి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచింపసాగాడు.

తిరుమల దర్శనం

ఒకనాడు(8వ ఏట)ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతి బయలుదేరాడు. సంప్రదాయం తెలియక తిరుమల కొండను చెప్పులతో కొండనెక్కుచుండగా అలసిపోయి ఒక వెదురు పొదలో నిద్రపోయెను. అప్పుడు ఆయనకు కలలో అలివేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాన్నాన్ని ప్రసాదించి, పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది. [2] అప్పుడు పరవశించి అలమేలుమంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీవేంకటేశ్వర శతకము రచించాడు. తిరుమల శిఖరాలు చేరుకొన్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి, వరాహ స్వామి దేవాలయంలో ఆదివరాహ స్వామిని దర్శించుకొన్నాడు. పిదప వేంకటపతి కోవెల పెద్దగోపురము ప్రవేశించి "నీడ తిరుగని చింతచెట్టు"కు ప్రదక్షిణ నమస్కారాలు చేసి, గరుడ స్తంభానికి సాగిలి మ్రొక్కాడు. సంపెంగ మ్రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి "విరజానది"కి నమస్కరించాడు. భాష్యకారులైన రామానుజాచార్యులను స్తుతించి, యోగ నరసింహుని దర్శించి, జనార్దనుని (వరదరాజస్వామిని) సేవించి, "వంట యింటిలో వకుళా దేవి"కు నమస్కరించి, "యాగశాల"ను కీర్తించి, ఆనంద నిలయం విమానమును చూచి మ్రొక్కాడు. కళ్యాణమంటపమునకు ప్రణతులిడి, బంగారు గరుడ శేష వాహనములను దర్శించాడు. శ్రీభండారమును చూచి, బంగారు గాదెలను (హుండీని) సమర్పించి తన పంచె కొంగున ముడివేసుకొన్న కాసును అర్పించాడు. బంగారు వాకిలి చెంతకు చేరి, దివ్యపాదాలతో, కటివరద హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకొన్నాడు. తీర్ధ ప్రసాదాలను స్వీకరించి, శఠకోపముతో ఆశీర్వచనము పొంది, ఆ రాత్రి ఒక మండపములో విశ్రమించాడు. తరువాత అన్నమయ్య కొండపై కుమార ధార, ఆకాశ గంగ, పాప వినాశం వంటి తీర్ధాలను దర్శించి, కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు. అతని కీర్తనలు విని అర్చకులు అతనిని ఆదరించ సాగారు. [1]

తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రాదికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు. గురువుల వద్ద వైష్ణవ తత్వాలను తెలుసుకొంటూ, ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ, వేంకటేశ్వరుని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితం గడప సాగాడు.

సంసారం, సంకీర్తనం

అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి తిరిగి రమ్మని బ్రతిమాలారు. ముందు నిరాకరించినా గాని అన్నమయ్య గురువు ఆనతిపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. కాని నిరంతరం భగవధ్యానంలో ఉంటూ స్వామిని కీర్తిస్తూ ఉండేవాడు. అతనికి యుక్త వయస్సు రాగానే తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు తల్లిదండ్రులు. వైవాహిక జీవితంలో పడిన అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో కూడి తిరుమలను దర్శించాడు. ఆ సమయంలోనే శ్రీవేంకటపతికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అప్పటినుండి అన్నమయ్య పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పాడు. అతని శిష్యులు వాటిని గానం చేస్తూ తాళపత్రాలకు ఎక్కించసాగారు. తరువాత అన్నమయ్య తన భార్యలతో కలసి తీర్ధయాత్రలకు బయలుదేరాడు. వారు ముందుగా తమ వూరిలో చెన్నకేశవుని అర్చించారు. మార్గంలో నెందలూరు సౌమ్యనాధుని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటరమణుని, చాగలమర్రి చెన్నకేశవుని దర్శించుకొన్నారు. తరువాత నవనారసింహ క్షేత్రం అయిన అహోబిలం చేరుకొని శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఆనందించారు. ఆ క్షేత్రాన్ని, తీర్ధాన్ని, దైవాన్ని అన్నమయ్య తన కీర్తనలతో స్తుతించాడు. అహోబల మఠ స్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠకోపయతులవద్ద అన్నమయ్య సకల వైష్ణవాగమాలను అధ్యయనం చేశాడు. అతని బోధనల ద్వారా పరబ్రహ్మస్వరూపమునర్చించే దివ్యయోగంలో కుల విచక్షణ వంటి అడ్డుగోడలను కూలగొట్టాలని అవగతం చేసుకొన్నాడు. ఇంకా అన్నమయ్య దక్షిణాదిన ఎన్నో వైష్ణవ క్షేత్రాలను దర్శించుకొన్నాడు. అతని కీర్తనలు అంతటా ప్రసిద్ధం కాజొచ్చాయి.

రాజాశ్రయం

విజయగర రాజ ప్రతినిధి, దండనాధుడు అయిన సాళ్వ నరసింగరాయలు (ఇతడు శ్రీకృష్ణదేవరాయలుకు తాత), టంగుటూరు కేంద్రంగా ఆ సీమ ("పొత్తపినాడు") పాలనా వ్యవహారాలు చూస్తుండేవాడు. అతనికి "మూరురాయర గండ" అనే బిరుదుండేది. అన్నమయ్య కీర్తనలు, అతని ఆశీర్వచన మహాత్మ్యం గురించి విన్న దండనాధుడు తాళ్ళపాకకు వెళ్ళి అన్నమయ్యను దర్శించి అతనితో సాన్నిహిత్యాన్ని పెంచుకొన్నాడు. తరువాత అతను పెనుగొండ ప్రభువయినాక అన్నమయ్యను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. రాజ ప్రాపకం వలన అన్నమయ్య సంగీత ప్రభావం కన్నడదేశంలో హరిదాసకూటాలలో ప్రసిద్ధమయ్యింది. తరువాతి కాలంలో ఆ రాజు అన్నమయ్యను తనపై కూడా ఒక్కపదాన్ని వినిపించమని కోరాడట. హరిని కీర్తించే నోట నరుని కీర్తించనని అన్నమయ్య నిరాకరించినందున, కోపించి రాజు అతనిని చెరసాలలో సంకెళ్ళలో ఉంచాడట.

అంత్య కాలం

రాజాస్థానం తనకు తగినది కాదని తెలుసుకొని అన్నమయ్య తిరుమల చేరాడు. తన శేషజీవితాన్ని స్వామి సన్నిధిలో నిత్యారాధనలో, సంకీర్తనా దీక్షలో గడిపాడు. ఈ దశలో బహుశా ఆధ్యాత్మిక సంకీర్తనలు అధికంగా రచించాడు. వేంకటాచలానికి సమీపంలో ఉన్న "మరులుంకు" అనే అగ్రహారంలో నివసించేవాడు. ఈ సమయంలో రాజ్యంలో కల్లోలాలు చెలరేగాయి. అంతఃకలహాలలో రాజవంశాలు మారాయి. అన్నమయ్య జీవితంపట్ల విరక్తుడై నిత్యసంకీర్తనలతో పొద్దుపుచ్చేవాడు. అతని కీర్తనలలోని ఆశీర్వచన మహాత్మ్యం కధలు కధలుగా వినిన ప్రజలు అతని సంకీర్తనా సేవకు జనం తండోపతండాలుగా రాసాగారు.
ఈ సమయంలోనే పురందర దాసు తిరుమలకు వచ్చాడు. ఇద్దరూ వయోవృద్ధులు. భక్తశ్రేష్టులు. విష్ణుసేవాతత్పరులు. సంగీత కళానిధులు. ఒకరినొకరు ఆదరంతో మన్నించుకొన్నారు. "మీ సంకీర్తనలు పరమ మంత్రాలు. వీటిని వింటే చాలు పాపం పటాపంచలౌతుంది. మీరు సాక్షాత్తు వేంకటపతి అవతారమే" అని పురందరదాసు అన్నాడట. అప్పుడు అన్నమాచార్యుడు "సంధ్య వార్చుకోవడానికి సాక్షాత్తు విఠలునితోనే నీళ్ళు తెప్పించుకొన్న భాగ్యశాలివి. మీ పాటలు కర్ణాటక సంగీతానికే తొలి పాఠాలు. మిమ్ము చూస్తే పాండురంగని దర్శించుకొన్నట్లే" అన్నాడట.

95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపిన అన్నమయ్య దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.

ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు. అవసానకాలంలో తన కొడుకు పెద తిరుమలయ్యను పిలచి, ఇంక దినమునకు ఒక్క సంకీర్తనకు తక్కువ కాకుండా శ్రీనివాసునకు వినిపించే బాధ్యతను అతనికి అప్పగించాడట.

అన్నమయ్య కీర్తనలు, రచనలు

అన్నమయ్య సంకీర్తనా సేవ సంగీత, సాహిత్య, భక్తి పరిపుష్టం. అధికంగా తెలుగులోనే పాడినా అతను సంస్కృత పదాలను ఉచితమైన విధంగా వాడాడు. కొన్ని వందల కీర్తనలను సంస్కృతంలోనే రచించాడు. కొన్నియెడల తమిళ, కన్నడ పదాలు కూడా చోటు చేసుకొన్నాయి. అతని తెలుగు వ్యావహారిక భాష. మార్గ, దేశి సంగీత విధానాలు రెండూ అతని రచనలలో ఉన్నాయి. అన్నమయ్యకు పూర్వం కృష్ణమాచార్యుల వచనాలవంటివి ఉన్నా గాని అవి "అంగాంగి విభాగం లేక, అఖండ గద్య ధారగా, గేయగంధులుగా" ఉన్నాయి. శివకవుల పదాలగురించి ప్రస్తావన ఉన్నాగాని అవి లభించడంలేదు. మనకు లభించేవాటిలో అన్నమయ్యవే తొలిసంకీర్తనలు గనుక అతను "సంకీర్తనాచార్యుడు", 'పదకవితా పితామహుడు" అయ్యాడు.

అన్నమయ్య "యోగ వైరాగ్య శృంగార సరణి" మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు. (వాటిని కొందరు కరగించుకొని ఉండవచ్చును.)

సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో "శృంగార మంజరి" అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో "వేంకటేశ్వర శతకము" ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మాటలలో అన్నమయ్య రచనలు " ఒక సారస్వత క్షీర సముద్రం. కావ్యముల ధర్మమైన బావార్జవంలో, శైలిలో, భావవైవిధ్యంలో, రాశిలో అన్నమాచార్యుని రచనను మించినది ఆంధ్ర వాఙ్మయంలో మరొక్కటి లేదు... నగుబాట్లైన ద్విపద, పద కవితలను ఉద్ధరించి ఉన్నత స్థానం కలిగించిన ప్రతిష్ఠ అన్నమాచార్యునిదే"

అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.

ఉదాహరణలు

అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము॥అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥

చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥

కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥


అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||

పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||

మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల |
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||

పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ||

కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||

కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||


కులుకక నడవరో కొమ్మలాలా (రాగం - దేసాళం)కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు

ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మీద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు

చల్లెడి గందవొడి మై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు

జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు


క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయమునకు నీరాజనం
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనంచరణ కిసలయములకు సకియ రంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం


జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవిందనందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీ శాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి

అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి

హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల


చెల్లఁబో తియ్యనినోరఁ జేఁ దేఁటికి యీ-
పల్లదపుఁగోరికలపాలు సేయవలెనాఆసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట
దాసునిఁగా నపలిదైవమా నీవు
పోసరించి భూమిలోనఁ బుట్టించి రక్షించి
యీసులేక భంగేట్టు టిది గొంత వలెనా

పామరపుటింద్రియాలబారిఁ దోసితివి నన్ను
దామెనకట్టుగాఁ గట్టి తత్వమా నీవు
దోమటి నామతిలోనఁ దోడునీడవై యుండి
పామేటిసుఖములనే భ్రమయించవలెనా

గక్కన నింతట నన్నుఁ గరుణించితివి నేఁడు
మొక్కితి శ్రీవేంకటాద్రిమూలమా నీకు
దిక్కుదెసవై నాకు దేవుండవై యేలికవు
చొక్కి నామన సింత సోదించవలెనా

ప్రధాన వ్యాసం: తాళ్ళపాక కవులు

అన్నమయ్య వంశం తెలుగు సాహిత్యానికి ఆభరణం. అన్నమయ్య తండ్రి మహాపండితుడు. తల్లి సంగీతకళానిధి. అన్నమయ్య భార్య తిమ్మక్క తెలుగులో తొలి కవయిత్రి. "సుభద్రా కళ్యాణం" మంజరి ద్విపద కావ్యం రచించింది. ఈమె కుమారుడు నరసింహుడు సంగీత సాహిత్య కళా కోవిదుడని చిన్నన్న వ్రాశాడు ("పాడఁజెప్పఁగ వర్ణపద్ధతినీడు, జోడులేఁడని సభ సొచ్చి వాదించి, పరఁగిన ధీశాలి ప్రతివాదదైత్య నరసింహుఁడనఁగల్గె నరసింహగురుఁడు"). కవికర్ణ రసాయనం అనే కావ్యాన్ని వ్రాసిన సంకుసాల నృసింహకవి ఇతడేనని కొందరి అభిప్రాయం. నరసింగన్న భార్యలు వాచ్చారమ్మ, అనంతమ్మ. వారి పుత్రులు నారాయణుడు, అప్పలార్య, అన్నలార్య.

తిరుమలాచార్యుడు తండ్రి వలెనే సంకీర్తనా యజ్ఞం నిర్వహించాడు. ఇతని ఆధ్యాత్మ శృంగార సంకీర్తనలతో పాటు మరికొన్ని లఘురచనలు లభించాయి. వెంకటేశ్వర వచనములు, శృంగార దండకము, చక్రవాళ మంజరి, శృంగార వృత్త శతకము, వేంకటేశ్వరోదాహరణము, నీతి సీసశతకము, సుదర్శన రగడ, రేఫఱకార నిర్ణయం, ఆంధ్ర వేదాంతం (భగవద్గీత తెలుగు అనువాదవచవం), శ్రీ వేంకటేశ ప్రభాత స్తవము (ద్విపద), సంకీర్తనా లక్షణ వ్యాఖ్యానం (అలభ్యం) వంటివి రచించాడు. ఇతని భార్య తిరుమలమ్మ. వారి కొడుకులు చిన తిరుమలయ్య, అన్నయ్య, పెదతిరువెంగళ నాధుడు, చినతిరువెంగళనాధుడు (చిన్నయ్య లేదా చిన్నన్న), కోనేటి తిరువేంగళనాధుడు. చినతిరుమలయ్య తన తండ్రి, తాతలవలెనే ఆధ్యాత్మ, శృంగార సంకీర్తనలు రచించాడు. ఇంకా అష్టభాషా దండకం, సంకీర్తన లక్షణం (తండ్రి, తాతల సంస్కృత రచనలకు అనువాదం) వ్రాశాడు.

చినతిరుమలయ్య, అతని భార్య పెదమంగమ్మల కొడుకు తిరువేంగళప్ప అమరుక కావ్యానువాదము, అమరకోశానికి బాల ప్రబోధిక వ్యాఖ్య, ముమ్మటుని కావ్య ప్రకాశికకు సుధానిధి వ్యాఖ్య, రామచంద్రోపాఖ్యానం (అలభ్యం) వంటి రచనలు చేశాడు. పెద తిరుమలయ్య కొడుకు చిన్నన్న జనుల మన్ననలు పొందిన పరమ భక్తుడు, మహాగాయకుడు, భజన సంప్రదాయ ప్రచారకుడు, ద్విపద కవితకు విశేషంగా ప్రచారాన్ని కలిగించాడు. ఇతడు రచించిన అన్నమాచార్యుని జీవిత చరిత్రయే మనకు అన్నమయ్య జీవితానికి సంబంధించిన ప్రధాన ఆధార గ్రంధము. అంతే గాక ఇతడు పరమయోగి విలాసము, అష్టమహిషీ కళ్యాణము, ఉషా పరిణయము అనే ద్విపద కావ్యాలను రచించాడు. అన్నమయ్య, అక్కలమ్మల కుమార్తె తిరుమలాంబను తిరుమల కొండయార్యునికిచ్చి పెండ్లి చేశారు. వారి కొడుకు రేవణూరి వెంకటాచార్యుడు శకుంతలా పరిణయము, శ్రీపాదరేణు మహాత్మ్యము.

ఇలా తాళ్ళపాక కవులు తెలుగు భాషకు, ప్రత్యేకించి పదకవితకు, ద్విపద కవితకు ఎనలేని సంపదను ఒనగూర్చారు. "చిన్నన్న ద్విపద కరగును, పన్నుగ పెద తిరుమలయ్య పదమునకెరగున్, మిన్నంది మొరసె నరసింగన్న పద్య గద్య శ్రేణిన్" అని తెనాలి రామకృష్ణుని చాటువు.

దొరికిన పెన్నిధి

తిరుమల సంకీర్తనా భండారంలో లభించిన రాగిరేకులలో ఒకటి

1922లో, 14,000 అన్నమయ్య కీర్తనలు, ఇతర రచనలు లిఖించిన 2,500 రాగిరేకులు తిరుమల సంకీర్తనా భాండాగారం (తరువాత పెట్టిన పేరు)లో లభించాయి. ఇది తిరుమల హుండీకి ఎదురుగా ఉన్న ఒక రాతి ఫలకాల గది.

ప్రాజెక్టులు, సంస్మరణా కార్యక్రమాలు

2004 లో అన్నమయ్య స్మృత్యర్ధం విడుదల చేసిన తపాలా బిళ్ళ
ప్రధాన వ్యాసం: అన్నమాచార్య ప్రాజెక్టు

అన్నమయ్య యొక్క విస్తృత పద సంపదను ఉపయోగించుకొని ప్రజలలో వేంకటేశ్వరుని మధురభక్తిని మరియు శరణాగతిని ప్రోత్సహించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు స్థాపించబడినది. అన్నమాచార్య ప్రాజెక్టులో సంగీతం, పరిశోధన మరియు ప్రచురణ, రికార్డింగ్‌ అనే మూడు భాగాలున్నాయి. యువకళాకారులను తయారు చేసే దిశగా సంగీత విభాగం పని చేస్తుంది. పరిశోధన మరియు ప్రచురణ విభాగంలో భాగంగా అన్నమాచార్య సంకీర్తనల మీద, అన్నమాచార్యుల జీవిత చరిత్ర మీద పరిశోధన చేసేవారికి ప్రోత్సాహం లభిస్తుంది. రికార్డింగు విభాగం ద్వారా అన్నమయ్య సంకీర్తనలను ఆడియో క్యాసెట్ల రూపంలో తయారుచేసి మార్కెట్టులో అమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానము నిర్వహించే ధర్మ ప్రచార పరిషత్ తప్పితే మిగతా ప్రాజెక్టులన్నీ అన్నమాచార్య ప్రాజెక్టు పరిధిలోకి వస్తాయి. అన్నమాచార్య ప్రాజెక్టుతో దగ్గరి అనుబంధాన్ని కలిగి ఉంటాయి. అవి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, భాగవత ప్రాజెక్టు, వేద రికార్డింగు ప్రాజెక్టు.

అన్నమయ్య ఆరు వందల జయంతి సందర్బంగా తాళ్ళపాక లో 19-5-2008 నుండి 22-05-2008 వరకు వుత్సవాలు జరుగుతున్నాయి.ఈ సందర్బంగా 108 ఆడుగుల విగ్రహాన్ని 108 రోజులలో నిర్మించారు. తి.తి.దే వారు నిర్వహిస్తున్నారు. అన్నమయ్య 12 వ తరము వారు అగర్బ దరిద్రములో కొట్టుమిట్టాడు తున్నారని(చూడుడు ఆంధ్రజ్యోతి తేది 23-05-08), ప్రభుత్వము వారు పించన్లు ఏర్పాటు చెయ్యడానికి వొప్పుకొన్నారు.అన్నమయ్య సాహితీ సంపదను తరతరాల వారికి అందించ డానికి , వారి వంశస్థులను వినియోగించ వచ్చును.

పెరుగుతున్న ప్రాచుర్యం

  • అన్నమాచార్యులువారు రచించిన కీర్తనలు చాలావరకూ అదృశ్యం కాగా మనకు మిగిలిన కీర్తనలు 15 వేలు.
  • బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ 600 సంవత్సరాలు క్రితమే మనషులంతా సమానమేనంటూ అన్నమయ్య సంకీర్తనలు రచించారు.
  • అన్నమయ్య రచించిన కీర్తనలలో ఎక్కువగా శృంగార కీర్తనలే ఉన్నాయి. బాహ్య అర్థమొకటి, అంతరార్థమొకటి.
  • ఆయన రచనల్లో కడప, రాయలసీమ యాస ఎక్కువగా ఉంటుంది. నిఘంటువు తయారు కావాలి

అన్నమయ్య పాటల ద్వారా ప్రసిద్ధులైన కొందరు గాయకులు

  • బాలకృష్ణ ప్రసాద్
  • శోభారాజు [1]
  • పారుపల్లి రంగనాథ్
  • కొండవీటి జ్యోతిర్మయి[2]
  • ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి
తెవికీ సౌజన్యంతో...
 

హాలికులైననేమి! ఆల్కహాలికులైన నేమి?

నాడు

బాలరసాలసాలనవపల్లవ కోమల కావ్యకన్యకం
గూళలకిచ్చి యప్పడుఁపు గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గహనాంతరసీమలఁ గందమూల కౌ
ద్దాలికులైననేమి నిజ దార సుతోదర పోషనార్థమై.

శ్రీనాథుడు హాలికుల క్షేమమా అని ఎగతాళి చేసినపుడు పోతన చెప్పిన పద్యం…

- Sricharan Kocherlakota

నేడు

సత్కవుల్ హాలికులైన నేమి?..అని ఆనాటి వారంటే..’..సత్కవుల్ ఆల్కహాలికులైన నేమి?’..అని నేటి తరం వారి ప్రశ్న..శ్రీనాధుడు కనీసం నలభై సంవత్సరాల ముందు వాడు పోతనకు..ఎక్కువలో ఎక్కువ శ్రీనాధుని కవిత్వ రస గ్రహణం చేసివుంటాడు పోతన..ఆంధ్ర సాహిత్య సంబంధమైన అందమైన కల్పనలలో ఇదొకటి.. శ్రీనాధునికి..పోతనకు బంధుత్వం..వారి మధ్య పలుకుల యుద్ధం…బోయీలు లేకుండా శ్రీనాధుడు పల్లకీని నడిపిస్తే..ఎద్దులు లేకుండా పోతన నాగలి నడిపించడం..సిరికిన్ జెప్పడు..పద్యం సందర్భంలో కథ…ఇలాంటివే ఇంకొన్ని రామదాసుకు కబీరు మంత్రోపదేశం చేశాడు అని’సెక్యులర్ భుజాలు చరుచుకోవడం’..అక్బర్ సమకాలికుడు కబీర్ అయితే..ఆ తర్వాత చాలా తరాల వాడు కదా రామదాసు!..ఒక విచిత్రమేమిటంటే..సంస్కృత, ఆంధ్ర మహాకవుల నెందరినో పేరు పేరునా ప్రస్తావించి ప్రస్తుతి చేసిన పోతన తన అవతారికలో శ్రీనాధుని వూసైనా ఎత్తలేదు!..ఎందుకనో?

- Vanam Venkata Varaprasadarao

 

ఓ ప్రియతమ….

నీ ఎడబాటు వేదనలోంచి నా కన్నీళ్ళు వస్తే 
ఆ కన్నీళ్ళు అన్ని కలసి ఓ కలం అయితే.. 
ఆ కలానికి ఓ కవిత పూస్తే ఆ కవిత లో మళ్లీ నువ్వే పుట్టావు…..

ప్రేమ  ఎప్పుడు  పుడుతుంది 
మనషు  దగ్గర  ఐనప్పుడు 
మనుషు  ఎప్పుడు  దగ్గర  అవుతుంది 
మనిషి  కి  మనిషి  దగ్గర  ఐనప్పుడు
మనిషి కి  మనిషి  ఎప్పుడు  దగ్గర అవుతాడు
మనసు లో స్నేహం చిగురించి నప్పుడు...

 
 
About PravasaRajyam

ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగి… ఎక్కడో వున్నాము…వి్వ వ్యాప్తంగా విస్తరించి వున్న మన తెలుగు ప్రజలందరం ఒక్క చోట చేరాలన్న ఆకాంక్షతో చేస్తున్న నా ఈ చిరు ప్రయత్నమే “ప్రవాసరాజ్యం”( www.pravasarajyam.com )

NRI Network

For info please go through NRI

For NRI Gallery Click NRI Events

Get in touch

UAE Phone: +971 509 772055
Email: uae@pravasarajyam.com

USA Phone: 912-246-6649
Email: usa@pravasarajyam.com

India Phone: +91-40-64592288
Email: ind@pravasarajyam.com

www.pravasarajyam.com